ప్రేమ బంధం కన్నీటి సంద్రం.. భార్య ఎదుటే భర్త దుర్మరణం
*శ్రీకాళహస్తి: పదేళ్లు క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ప్రేమకు చిహ్నంగా ఇద్దరు మగపిల్లలు పుట్టడంతో సంతోషానికి అవధుల్లేవు.*
రోజంతా ఇద్దరూ కాయకష్టం చేసి పిల్లల్ని చదివించుకుంటున్నారు. వారి ఆనందాన్ని చూసి విధి కన్నుకుట్టింది. ఊహించని ప్రమాదంతో కళ్లముందే కట్టుకున్న భర్త కడతేరిపోవడంతో భార్యతో పాటు పిల్లలు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. ఈ హృదయ విధారక ఘటన.. శ్రీకాళహస్తి పట్టణం శుకబ్రహ్మాశ్రమం సమీపం మంగళవారం చోటు చేసుకుంది. కేవీబీపురం మండలం ఆదరం గ్రామానికి చెందిన వినోద్ (32) పదేళ్ల క్రితం మనీషాను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కుటుంబ పోషణ నిమిత్తం ఇద్దరూ శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలోని రాజీవ్నగర్లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు. వినోద్ తాపీమేస్త్రీగా పనులకు వెళ్తుంటే, మనీషా అతని సహాయకురాలిగా కూలి పనులకు వెళ్తుంది.
*వస్తున్నానంటూ..తిరిగిరాని లోకాలకు....*
మంగళవారం ఐదో అంతస్తు వద్ద సిమెంటు పూత పని జరుగుతోంది. టిఫిన్ తినేందుకు మనీషా వినోదు పిలిచింది. కొంత మేర పని ఉందని చేసి వస్తున్నానని చెప్పిన వినోద్ అక్కడ అమర్చిన కర్రలు జారడంతో పట్టు తప్పి పైనుంచి కిందపడిపోయాడు. రక్తగాయాలతో పడిన ఉన్న వినోద్ను చూసి మనీషా తల్లడిల్లిపోయింది. భర్తకు ఏమీ కాదని, తనను వదలి వెళ్లడంటూ ఎంతో ఆర్తితో చివరి వరకు ప్రయత్నించింది. తీరా ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికి మృతి చెందాడని తెలిసి కన్నీరుమున్నీరై విలపించింది. హృదయ విధారక ఘటనతో రాజీవ్నగర్, ఆదరంలోనూ పలువురు కన్నీటి పర్యంతమయ్యారు.
Post A Comment:
0 comments: