రీల్స్ చేస్తుండగా విషాదం.. ఆరుగురు అమ్మాయిలు మృతి
ఒకప్పుడు టిక్టాక్ రీల్స్కు విపరీతమైన క్రేజ్ ఉండేది. టిక్టాక్లో ఫేమస్ కావాలన్న ఉద్దేశ్యంతో చాలా మంది పిచ్చి పిచ్చి పనులు చేసేవారు. ఈ నేపథ్యంలోనే ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ప్రతీ నిత్యం ఏదో ఒక న్యూస్ టిక్టాక్ విషాదాల గురించి వచ్చేది. టిక్టాక్ దేశంలో బ్యాన్ అయిన తర్వాత.. ఆ స్థానాన్ని ఇన్స్టాగ్రామ్ తీసుకుంది. ఇన్స్టాలో ఫేమస్ అవ్వాలని చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలి వాళ్ల దగ్గరి వరకు ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, ఓ ఆరుగురు అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియో చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. నదిలో మునిగి చనిపోయారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో మంగళవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, ఆగ్రా సమీపంలోని నగ్లా స్వామి గ్రామానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు రీల్స్ వీడియో తీయడానికి యమునా నది దగ్గరకు వెళ్లారు. నది వారి ఇళ్లకు 800 మీటర్ల దూరంలోనే ఉంది.
ఆ ఆరుగురు అమ్మాయిలు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నదిలోకి దిగారు. వీడియో తీసుకుంటూ ఉన్నారు. అనుకోని విధంగా ఓ అమ్మాయి లోతుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లింది. నీటిలో మునిగిపోతూ ఉంది. ఇది గమనించిన మిగిలిన వాళ్లు ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు. వారు కూడా నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న ఓ ఇద్దరు అబ్బాయిలు వారిని రక్షిద్దామని అనుకున్నారు. వారి వల్ల కాలేదు. దీంతో ఆరుగురు అమ్మాయిలు నీటిలో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు, పోలీసులు నది దగ్గరకు చేరుకున్నారు.
నీటిలో కొట్టుకుపోయిన వారి కోసం గాలించారు. సంఘటన జరిగిన ప్రదేశం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఆరుగురు దొరికారు. వారిలో నలుగురు అప్పటికే చనిపోయి ఉన్నారు. మిగిలిన ఇద్దర్నీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు సీపీఆర్ చేయటంతో బతికారు. అయితే, కొన్ని గంటల తర్వాత వారు కూడా చనిపోయారు. చనిపోయిన వారిలో ముస్కాన్ అనే అమ్మాయికి కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం అయింది. నవంబర్ నెలలో పెళ్లి ఉంది. ఇంతలోనే ఇలా జరిగింది. ఈ ఆరుగురు అమ్మాయిలు ఒకే కుటుంబానికి చెందిన వారు. అక్కాచెల్లెళ్లు అవుతారు. వీరి మృతితో కుటుంబంతో పాటు గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
Post A Comment:
0 comments: