చైనా, పాక్ వైమానిక రక్షణ వ్యవస్థలు
బ్రహ్మోస్ ముందు సరిపోవు: అమెరికా యుద్ధరంగ నిపుణుడు
'ఆపరేషన్ సిందూర్'తో భారత్ పూర్తిగా పాకిస్తాన్పై ఆధిపత్యం చెలాయించిందని.. యూఎస్ యుద్ధరంగ నిపుణుడు కల్నల్ (రిటైర్డ్) జాన్ స్పెన్సర్ పేర్కొన్నారు. భారత్లోని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారతదేశం చేపట్టిన దాడి రక్షణాత్మక ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని అన్నారు. పాకిస్తాన్లోని ఏ ప్రదేశాన్ని అయినా ఎప్పుడైనా, ఎక్కడైనా ఢీ కొనగలమనే సందేశాన్ని ఈ ప్రపంచానికి భారత్ ఇచ్చినట్లైందని వివరించారు. పాకిస్తాన్ ఉపయోగించిన చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ భారతదేశ బ్రహ్మోస్ క్షిపణులను ఏమాత్రం తట్టుకోలేకపోయిందని ఆయన చెప్పారు..
పాకిస్తాన్ వ్యాప్తంగా దాడి చేయడంతో పాటు పాకిస్తాన్ డ్రోన్ దాడులు, హై స్పీడ్ క్షిపణులను భారత్ విజయవంతంగా ఎదుర్కొందని, వాటి నుంచి తనను తాను రక్షించుకుందని స్పెన్సర్ తెలిపారు. మోడరన్ వార్ ఇన్స్టిట్యూట్లో అర్బన్ వార్ఫేర్ స్టడీస్ అధిపతిగా పనిచేస్తున్న స్పెన్సర్, పాకిస్తాన్ ఉపయోగించిన చైనీస్ వైమానిక రక్షణ వ్యవస్థను బ్రహ్మోస్ విజయవంతంగా ఛేదించిందని ఇది భారత అధునాతన సైనిక సామర్థ్యాలకు నిదర్శనమని అన్నారు..
గత వారం పాకిస్తాన్.. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, ఫతాహ్ క్షిపణులతో దాడులకు పాల్పడగా.. భారత్ వీటిని సమర్థవంతంగా ఎదుర్కొందని.. ఆ తర్వాత శనివారం తెల్లవారుజామున భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో పాక్ వైమానిక స్థావరాలపై దాడులు చేసిందని స్పెన్సర్ వివరించారు. 11 స్థావరాలను ధ్వంసం చేసిందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్ సైన్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని, రాబోయే సంవత్సరాల్లో సైనిక వ్యూహాకర్తలు, విద్యార్థులు ఈ ఆపరేషన్ని అధ్యయనం చేస్తారని ఆయన అన్నారు..
ఉగ్రవాదంపై పాకిస్తాన్ను ప్రపంచం ఎండగట్టే సమయం ఆసన్నమైందని.. పశ్చిమ దేశాలు రెండు నాలుకల విధానాన్ని ఆపాలని కోరారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని స్పెన్సర్ గట్టిగా సమర్థించారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే విధానంపై పునరాలోచించుకునేలా చేయడంలో ఈ నిర్ణయం సహాయపడుతుందని అన్నారు..
Post A Comment:
0 comments: